https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/29/Ambati-Rambabu.jpg?itok=39AvaWR7

నిమ్మ‌గ‌డ్డ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ‌తాం



సాక్షి, తాడేపల్లి: నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అన్నారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేయ‌గా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయారు. ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియయాకం జ‌రిగింది. దీనిపై టీడీపీ, బీజేపీ నేతలు హైకోర్టుకు వెళ్ళారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ ఆర్డినెన్స్ జీవోల‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. అయితే ఒక్కో స‌మ‌యంలో న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు పై కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంది. దానిపై న్యాయ‌నిపుణుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నా"మ‌ని తెలిపారు. (నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కేసులో తుదితీర్పు)

కోర్టు వ్య‌తిరేకంగా తీర్పు ఇస్తే రాజీనామా చేయాలా?
ఎన్నికల్లో మద్యం, డబ్బు అరికట్టాలని తమ ప్రభుత్వం చట్టం తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా చంద్రబాబు పంపిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం పెట్టారు. ఇటువంటి లేఖల వల్ల ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంద‌ని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో చాలాసార్లు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కోర్టులు తీర్పులిచ్చాయన్న విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వ అధికారాలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసునని, రాజ్యాంగానికి లోబ‌డే అన్ని వ్యవస్థలు పని చేయాల‌ని అంబ‌టి పేర్కొన్నారు.