http://www.prajasakti.com/./mm/20200529//1590728710.samayam-telugu.jpg

టిక్‌టాక్‌ వీడియోలు చూడొద్దని తల్లి మందలింపు.. బాలిక ఆత్మహత్య

        చిన్నచిన్న కారణాలతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. అమ్మ అరిచిందనో.. నాన్న తిట్టాడనో.. ఖర్చులకు, జల్సాలకు డబ్బులివ్వలేదనో.. ఇలా కని పెంచిన వారు ఒక్క మాట అంటే చాలు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నేటి యువతీయువకులు. నిత్యం సెల్‌ఫోన్‌లో టిక్‌టాక్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం మంచిది కాదని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన దీపిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిది. గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న న ఘటన హైదరాబాద్‌లో జరిగింది. నగరంలోని రామంతాపూర్‌ అరవింద్‌ కాలనీ వీధి-2లో ఉండే కనుపూర్తి రాజ లింగం ఫుట్‌వేర్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురు దీపిక (17) పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా ఇంట్లోనే ఉంటున్న దీపిక రోజూ టిక్‌టాక్‌ వీడియోలు చూడటం, వీడియో గేమ్స్‌ ఆడటం చేస్తుండేది. వాటికి నెమ్మదిగా బానిసైంది. తల్లి ఏ పని చెప్పినా చేయకుండా రోజంతా సెల్‌ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తూ వస్తోంది. దీంతో గురువారం దీపికను తల్లి గట్టిగా మందలించింది. ఎప్పుడూ సెల్‌ఫోన్‌తోనే ఉంటే ఇంటి పనులు ఎప్పుడు నేర్చుకుంటావని తిట్టింది. మనస్తాపానికి గురైన ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. దీపిక ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తల్లి, అక్కాచెల్లెళ్లు ఆందోళన చెందారు. తలుపు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా దీపిక ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. తండ్రి రాజలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.