https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/28/JUSICE-EASWARAIAH.jpg?itok=mv7Hg_x_

చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి



సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ప్రతి విషయంలోనూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సర్వసాధారణంగా మారిపోయిందని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య దుయ్యబట్టారు. బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్ధక ఆస్తుల విక్రయానికి గతంలో జీఓలు ఇవ్వడమే కాకుండా టీటీడీ బోర్డుతో తీర్మానాలు కూడా చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు వాటితోనే ప్రస్తుత ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.

ఎక్కడెక్కడో ఇతర రాష్టాల్లో ఉన్న చిన్న స్థలాలు నిరర్థకంగా ఉండి, ఆక్రమణలకు గురవుతున్నాయని, వీటిని పరిరక్షించడం కూడా టీటీడీకి భారంగా మారిందని గతంలో పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చడం సిగ్గుచేటన్నారు. కాగా వైద్యవిద్యా కోర్సు సీట్ల భర్తీలో మెరిట్‌ కోటాలో సీటు పొందిన రిజర్వుడ్‌ అభ్యర్థి తన కేటగిరీలోని మరో సబ్జెక్టులో సీటు పొందినప్పుడు ఖాళీ అయ్యే మెరిట్‌ కోటా సీటును అదే రిజర్వుడ్‌ అభ్యర్థితో భర్తీ అయ్యేలా చర్యల కోసం సీఎం వైఎస్‌ జగన్‌కి విన్నవించానని ఈశ్వరయ్య తెలిపారు. ఇందుకు అనుగుణంగా జీఓలో మార్పులు చేయడానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.