https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/adithya-thackeray.gif?itok=BM4z0DCp

నటిపై ఆదిత్య ఠాక్రే ప్రశంసలు!



బాలీవుడ్‌ నటి, ప్రముఖ నిర్మాత కుమార్తె జోయా మొరానిపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రశంసలు కురిపించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ నుంచి కోలుకుని రెండుసార్లు ప్లాస్మా దానం చేసిన ఆమె ధైర్యాన్ని కొనియాడారు. కాగా జోయాకు కరోనా సోకినట్లు ఏప్రిల్‌లో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలోని నాయర్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొంది కోలుకున్నారు. ఇక కరోనా పేషెంట్ల చికిత్సలో.. గతంలో ఆ వైరస్‌ బారిన పడి కోలుకున్న రోగుల నుంచి సేకరించిన ప్లాస్మా కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో జోయా ముందుకు వచ్చారు.(నాకు కరోనా సోకలేదు.. కానీ: నటి)

ఈ నేపథ్యంలో మే తొలివారంలో ప్లాస్మా దానం చేసిన ఆమె.. మంగళవారం మరోసారి ఆ పని చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ‘‘ప్లాస్మా డొనేషన్‌ రౌండ్‌ 2! గతంలో ఐసీయూలో ఉన్న ఓ రోగి కోలుకునేందుకు ప్లాస్మా ఉపయోగపడింది. కోలుకున్న కోవిడ్‌ రోగులు దయచేసి మందుకు వచ్చి.. మరొకరి ప్రాణాలు కాపాడండి’’ అని ట్విటర్‌లో తన ఫొటోలు షేర్‌ చేశారు. ఇందుకు స్పందించిన ఆదిత్య ఠాక్రే జోయా ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. ‘‘ఈ విషయం కొందరికి ధైర్యాన్ని, ప్రోద్బలాన్ని ఇస్తుంది! ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. కాగా జోయాతో పాటు ఆమె సోదరి, తండ్రి కరీం మొరానీ సైతం కోవిడ్‌ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. (నొప్పి కూడా ఎక్కువ ఉండదు.. దయచేసి..)