https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/poes.jpg?itok=BStqf2F3

సీఎం కార్యాలయంగా పోయస్‌ గార్డెన్‌

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత నేత జయలలిత నివాసాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చాలని మద్రాస్‌ హైకోర్టు అక్కడి ప్రభుత్వానికి సూచించింది. అయితే పోయస్‌ గార్డెన్‌లోని జయలలిత నివాసం వేదనిలయాన్ని మెమొరియల్‌గా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. పోయస్‌ గార్డెన్‌ను తాత్కలికంగా తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్‌ని జారీ చేసింది. అయితే తమ అత్తకు చెందిన ఆస్తిపై తమకు హక్కు ఉందంటూ జయలలిత మేనల్లుడు, మేనకోడలు దీపక్‌, దీపా కోర్టును ఆశ్రయించారు.  దీనిపై మద్రాస్‌ హైకోర్టు స్పందిస్తూ ఇటువంటి ప్రైవేట్‌ ఆస్తులను మెమొరియల్స్‌గా మార్చడం, వాటిని నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని కోర్టు పేర్కొంది. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్గా మారుస్తారా?)

అందుకే జయలలిత నివాసం వేద నిలయాన్ని ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయంగా మార్చాలని సూచించింది. ఇటువంటి వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడంతో ప్రజాధనం వృధా కాకుండా ఉంటుందని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించి జయలలిత వారసులకు సమాచారం అందించి అవసరమైతే వారికి డబ్బులు చెల్లించి భవానాన్ని సొంతం చేసుకోవాలని కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. జయలలితకు మేనకోడలు, మేనల్లుడు అయిన దీప, దీపక్‌లు జయలలితకు వారసులు అవుతారు. వారితో మాట్లాడిన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ఇక దీనికి సంబంధించిన విచారణను కోర్టు 8 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిపై నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. (లాక్‌డౌన్ 5.0 : 11 నగరాలపై ఫోకస్‌)