https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/flight_0.jpg?itok=dpJH6bbm

మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!

ముంబై : తమ సొంత ఊరికి వెళ్లేందుకు మేకలు అమ్ముకున్న వలస కార్మికునితోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ఉచితంగా సొంతింటికి చేర్చేందుకు భారత విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ అంగీకరించింది. వివరాలు.. లాక్‌డౌన్‌ కారణంగా అనేక మంది వలస జీవులు వేరే రాష్ట్రాలలో ఇరుక్కుపోయారు. ఇటీవల లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్రం దేశీయ విమానాలు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబైలో చిక్కుకున్న కొంతమంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లేందుకు సిద్ధ‌పడ్డారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?)

అయితే వీరికి మార్చి నెల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో విమాన టికెట్ల కోసం నానా తంటాలు పడి రూ.30,600లు సేకరించారు. వీరిలో ఒకరికి డబ్బులు కుదరకపోవడంతో తాను పెంచుకుంటున్న మూడు మేకలను అమ్ముకుని విమానం టికెట్టు కొనుగోలు చేశాడు. కాగా కొన్ని కారణాల వల్ల ఆ విమానం రద్దు అయింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మే 28 వరకు విమానయాన సేవలపై ఆంక్షలు విధించడంతో ఈ విమానాన్ని రద్దు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ పోస్టులో తెలిపారు. తాజాగా మేకలు అమ్ముకున్న వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌ పంపించేందుకు ఇండిగో అంగీకరించింది. కోల్‌కతాకు తిరిగి ప్రయాణించలేని ముగ్గురు ప్రయాణీకులకు తాము వసతి కల్పించామని ఇండిగో ట్వీట్ చేసింది. అయితే ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జూన్ 1నుంచి వలస కార్మికుల కోసం టికెట్ల బుకింగ్‌ తెరిచినట్లు ఇండిగో తెలిపింది. (అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో)