https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/27/medicine.jpg?itok=6-wiY9kv

హైదరాబాద్‌లోనే ‘ఫావిపిరవిర్‌’



సాక్షి,హైదరాబాద్‌:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణలో హైదరాబాద్‌కు చెందిన రాఘవ లైఫ్‌ సైన్సెస్‌(ఆర్‌ఎల్‌ఎస్‌) మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పలు ఔషధ కంపెనీలు మెడిసిన్‌ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తుండగా, ఆ సరసన తాజాగా ఆర్‌ఎల్‌ఎస్‌ కూడా చేరింది. తాము కరోనాను నియంత్రించే దిశగా అనేక ప్రయోగాలు చేసి రూపొందించిన ‘ఫావిపిరావిర్‌’ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఏవీయన్‌ సాధారణ వెర్షన్‌ అయిన ఈ ఫావిపిరావిర్‌ ఔషధాన్ని జపాన్‌లో కరోనా పాజిటివ్‌ రోగుల చికిత్స కోసం వినియోగిస్తుండగా, చైనా, టర్కీ తదితర దేశాల అధ్యయనాల్లోనూ ఈ ఔషధం సత్ఫలితాలు ఇస్తోందని ఆర్‌ఎల్‌ఎస్‌ పేర్కొంది. రష్యాలో నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో 80 మంది రోగులపై ఈ ఔషధాన్ని ప్రయోగించగా, రోగి కోలుకునే సమయం 11 రోజుల నుంచి 4 రోజులకు తగ్గిందని, రికవరీ రేటు సైతం 55.86 శాతం నుంచి 71.43 శాతానికి పెరిగిందన్నారు. (లాక్డౌన్ 5.0 ఉంటుందా లేదా?)

ముడిసరుకులన్నీ మనవే..
మన దేశంలోనే లభించే ముడి పదార్థాలతోనే ఫావిపిరవిర్‌ ఔషధాన్ని రూపొందించామని, ఏ స్థాయిలో ఉత్పత్తి చేసినా చైనా సహా ఇతర ఏ ఒక్క దేశంపై ఆధారపడే పరిస్థితి లేకుండా చూశామని, ఇదే  భారత ఫార్మాస్యుటికల్‌ రంగం సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చని ఆర్‌ఎల్‌ఎస్‌ కంపెనీ డైరెక్టర్‌ లోహిత్‌రెడ్డి పేర్కొన్నారు.ఇప్పటికే పేటెంట్‌ పొంది కరోనా నివారణలో వినియోగిస్తున్న పలు ఔషధాలతో పోలిస్తే ఫావిపిరవిర్‌ తక్కువ వ్యయంతో ఉత్పత్తి సాధ్యమైందని, ఫలితాలు కూడా మెరుగ్గా ఉన్నాయని, క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే అభివృద్ధి చెందుతున్న ఇండియాతో పాటు అనేక పేద దేశాలకు గొప్ప మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. (వెంట తెస్తున్నారు!)