https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/NARAYANN%20ranee.jpg?itok=L5Igh_CE

గవర్నర్‌తో మాజీ సీఎం రాణే భేటీ



ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీతో సోమవారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాణే ఆరోపించారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవడంతో పాటు భవిష్యత్‌లోనూ మహమ్మారిని ప్రస్తుత ప్రభుత్వం కట్టడి చేయలేదని అన్నారు.

కరోనా వైరస్‌ సంక్షోభంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా బీజేపీ నేతలు గవర్నర్‌తో భేటీ అవడం గమనార్హం. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సైతం ఇటీవల గవర్నర్‌తో సమావేశమై కరోనా కట్టడి సహా పలు అంశాలపై చర్చించారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకూ 50,231 కరోనా కేసులు నమోదవగా 1635 మంది మరణించారు.

చదవండి : మహా కలకలం