
ఉద్యోగులకు షాక్ : టీవీఎస్లో వేతనాల కోత
- కోవిడ్-19 ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ఎఫెక్ట్తో ఉద్యోగుల వేతనాల్లో కోతను విధిస్తున్నట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది. వేతన కోతను ప్రకటించిన దేశంలో తొలి టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ కావడం గమనార్హం. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్డౌన్తో ఉత్పాదకత, అమ్మకాలు నిలిచిపోవడంతో ఉద్యోగులందరికీ ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ వరకూ వేతనాలను తగ్గించాలని నిర్ణయించామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశవ్యాప్త లాక్డౌన్తో అమ్మకాలు తీవ్రంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఉద్యోగులకు వేతనాలను బట్టి 5 నుంచి 20 శాతం వరకూ వేతన కోత విధించారు. ఆటోమొబైల్ సేల్స్ దారుణంగా పడిపోవడంతో ఇతర ఆటోమొబైల్ కంపెనీ ఉద్యోగుల్లోనూ వేతన గుబులు మొదలైంది.