https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/earth.jpg?itok=kbcY15E3

ఇకపై ఫోన్‌లు పనిచేయవ్... కారణం?‌

లండన్: ఇప్పటి వరకు ప్రపంచం అంతా కరోనా మహమ్మారి పై పోరాడుతూ దానికి ఒక పరిష్కారం వెతకడంలో సతమతమవుతోంది. అయితే ఇప్పుడు మరో సమస్య రాబోతుందని శాస్త్రవేత్తలంటున్నారు. అయితే ఈ సమస్య వైరస్‌లకు, బ్యాక్టీరియాలకు సంబంధించినది, ఆరోగ్యానికి సంబంధించినది కాదు. టెక్నాలజీకి సంబంధించింది. మొబైల్‌ ఫోన్‌... ఇప్పుడు ఇది మన సాధారణ జీవితంలో ఒక భాగమైపోయింది. మొబైల్‌ లేనిదే బయటకు వెళ్లలేకపోతున్నాం. నిజం చెప్పాలంటే మొబైల్‌ ద్వారానే నేడు ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా పుట్టికొచ్చిన సమస్య ద్వారా మొబైల్‌ ఫోన్‌లు, శాటిలైట్‌లు ఆగిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే... (రీ ఓపెన్ అమెరికాపై బాట్స్ ఉద్యమం)

భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఇది మనల్ని సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటమే కాకుండా మన మొబైల్‌ సిగ్నల్‌, శాటిలైట్‌ సిగ్నల్స్‌ అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు  అందులో కొంత భాగం  బలహీన పడిపోయిందంట. అయితే ఎందుకు అలా జరుగుతోంది అన్న విషయం మాత్రం ఎవరికి అంతుచిక్కడం శాటిలైట్ల డేటా ఆధారంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా మధ్య ఈ బలహీనత ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.  సౌత్ అట్లాంటిక్ ఎనామలీ అని పిలిచే ప్రాంతం కొన్నేళ్లుగా విస్తరిస్తూ ఉందంట. దీని అర్థం ఏంటంటే... అయస్కాంత క్షేత్రాల బలహీనత రానూరానూ  ఎక్కువ ప్రాంతానికి విస్తరిస్తోందని అర్థం. ఇంతకుముందు 24000 నానాటెస్లాస్ ఉండే అయస్కాంత క్షేత్ర బలం కాస్త ఇప్పుడు 22000 నానోటెస్లాస్‌కి చేరిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) సైంటిస్టులు చెప్పారు. ఈ ఎనామలీ ఏరియా... ఏటా 20 కిలోమీటర్లు అదనంగా పడమర వైపు విస్తరిస్తోందని తెలిపారు.  తాజాగా... నైరుతీ ఆఫ్రికాలో మరో కొత్త ఎనామలీ మొదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.  ఒకే ఎనామలీ రెండుగా ముక్కలైందని వారు భావిస్తున్నారు. 

దీనిలో ప్రధాన సమస్య ఏంటంలే ఈ ఎనామలీ  ఈమధ్య కాలంలో చాలా వేగంగా విస్తస్తోంది. దీనికి సంబంధించి ఈఎస్‌ఏ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.... భూమిలో ఉత్తర, దక్షిణ ధ్రువాల అయస్కాంత క్షేత్రం తలకిందులుగా అవ్వడమే అయస్కాంత క్షేత్రం బలహీనంగా అవ్వడానికి కారణం.  దీని అర్థం ఉత్తర ధ్రువంలో ఉండే అయస్కాంత క్షేత్రం దక్షిణ ధ్రువానికీ, దక్షిణ ధ్రువంలో ఉండే అయస్కాంత క్షేత్రం ఉత్తర ధ్రువానికీ చేరినట్లన్నమాట. ఇలా ప్రతి 250000 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది అని తెలిపారు. ఇదిలా ఉండగా ఒక వేళ ఈఎస్‌ఏ చెప్పిందే నిజమైతే  ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ల కమ్యూనికేషన్ కొంతవరకూ దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే టెలికం నెట్‌వర్కులు, మొబైల్ ఫోన్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతవరకూ పనిచేయకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఈ రెండు ఎనామలీలు ఉన్న ప్రాంతాల్లో వెళ్లే విమానాలు సరిగా పనిచేయకపోవచ్చని కూడా పరిశోధకలు చెబుతున్నారు. అయితే మరోవైపు వేరే రకమైన వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి శాటిలైట్లు, మొబైళ్లకు ఏ సమస్య రాలేదు కాబట్టి,  ఇకపై కూడా  రాకపోవచ్చనే అంచనా వేస్తోన్నారు.  అయస్కాంత క్షేత్రం తలకిందులు అవ్వడం అనేది ఒక్క రోజులో జరగదు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ( ఆరోపణలు అర్థం లేనివి : చైనా)