
మళ్లీ టీమిండియా సూపరమ్మా!
వెల్లింగ్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్లో మ్యాచ్లు టై కావడమే చాలా అరుదైతే, వరుసగా రెండు మ్యాచ్లు టైగా ముగియడం ఇంకా విచిత్రం. టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాల్గో టీ20 టైగా ముగిసింది. ఈ జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ తొలుత టై కాగా, ఆ తర్వాత సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది. అచ్చం మూడో టీ20ని తలపించే విధంగా నాల్గో టీ20 కూడా టైగా ముగియడంతో మ్యాచ్ మరొకసారి ఉత్కంఠ భరితంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 165 పరుగులు చేయగా, న్యూజిలాండ్ కూడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 165 పరుగులే చేసింది. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన తరుణంలో కివీస్ పరుగు మాత్రమే చేసి సాన్ట్నార్ వికెట్ను కోల్పోయింది. దాంతో మ్యాచ్ టై అయ్యింది.
ఫలితం సూపర్ ఓవర్లో తేల్చనున్నారు. ఆఖరి ఓవర్లో కివీస్కు ఏడు పరుగులు అవసరం కాగా, ఆరు పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో కివీస్ ఒత్తిడికి లోనుకావడంతో సూపర్ ఓవర్ వరకూ తీసుకొచ్చింది. చివరి ఓవర్ను శార్దూల్ ఠాకూర్ వేశాడు. తొలి బంతికి రాస్ టేలర్ భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన క్యాచ్తో పెవిలియన్ చేరాడు. ఇక రెండో బంతికి డార్లీ మిచెల్ ఫోర్ కొట్టి కాస్త ఒత్తిడి తగ్గించాడు. మూడో బంతికి సీఫెర్ట్ రనౌట్ అయ్యాడు. మిచెల్ సింగిల్ కోసం యత్నించగా కీపర్ రాహుల్ సీఫెర్ట్ను రనౌట్ చేశాడు.. నాల్గో బంతికి సింగిల్ రాగా, ఐదో బంతికి మిచెల్ భారీ షాట్ ఆడే యత్నంలో ఔటయ్యాడు. ఆరో బంతిని సాన్ట్నార్ ఎదుర్కోగా రెండు పరుగులు తీసే యత్నం చేశాడు. బంతిని దగ్గరగా పెట్టి రెండు పరుగు తీయడంతో సాన్ట్నార్ను రాహుల్ రనౌట్ చేశాడు. దాంతో మ్యాచ్ టై అయ్యింది.