ఒకరి పరీక్ష మరొకరు రాసిన కేసులో.. ఇద్దరికి ఏడాది జైలు

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌(ఆంధ్రజ్యోతి): ఒకరి పరీక్ష మరొకరు రాసిన కేసులో ఇద్దరు నిందితులకు హయత్‌నగర్‌లోని 24 అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దేశ్‌ముఖ్‌లోని సెయింట్‌ మెరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న దుర్గ చరణ్‌మిశ్రా కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో స్నేహితుడు అరుణ్‌కుమార్‌ సహాయం కోరాడు. 2018 మేలో అవంతి కళాశాలలో జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు అరుణ్‌కుమార్‌ హాజరయ్యాడు. ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి హాల్‌టికెట్‌ తనిఖీ చేయగా మరొకరి పరీక్ష అతడు రాస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించి న్యాయస్థానంలో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్‌ సంధ్యారాణి చరణ్‌మిశ్రా, అరుణ్‌కుమార్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

8న బడ్జెట్‌పై సమావేశం

హైదరాబాద్‌ సిటీ, జనవరి30 (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీ ప్రత్యేక సమావేశం వచ్చే నెల 8వ తేదీన జరగనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదన, 2019-20 సవరణ బడ్జెట్‌పై సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.5,380 కోట్లతో జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్ల నుంచి వచ్చే నిధులను అంచనా వేస్తూ.. రూ.1,593 కోట్లతో బడ్జెట్‌ రూపొందించారు. స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిన ముసాయిదా బడ్జెట్‌పై ఫిబ్రవరి 20వ తేదీలోపు కౌన్సిల్‌లో చర్చించాలి. కౌన్సిల్‌ ఆమోదం పొందిన అనంతరం మార్చి 7వ తేదీ నాటికి ప్రభుత్వానికి పంపాలి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై చర్చించేందుకు ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.