https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/12/9/06.jpg?itok=Nj3XnuFO

‘ఈ నెల 14కి పది ఉరితాళ్లను సిద్ధం చేయండి'

పాట్నా: ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నిర్భయ అత్యాచార కేసుకు సంబంధించి దోషులకు ఉరిశిక్ష వేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బిహార్‌లోని బక్సర్ జైలుకు ఉన్నతాధికారులనుంచి ఓ సందేశం వచ్చింది. డిసెంబరు 14 నాటికి 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలన్నది ఆ సందేశంలోని సారాంశం. ఉరితాళ్లను రూపొందించడంలో బక్సర్ జైలుకు ఎంతో పేరుందన్న విషయం తెలిసిందే. గతంలో పార్లమెంటుపై దాడులు చేసిన అఫ్జల్ గురును ఉరితీసేందుకు ఉపయోగించిన తాడును కూడా ఈ జైల్లోనే తయారుచేశారు. తాజాగా.. మరోసారి ఉరితాళ్లు పంపించాలని బక్సర్ జైలుకు జైళ్ల శాఖ డైరెక్టరేట్ నుంచి వచ్చిన సందేశం ద్వారా ఆ ఉరితాళ్లు నిర్భయ నిందితుల కోసమేననని భావిస్తున్నారు.

చదవండి: 'నిర్భయకేసు దోషులకు త్వరలో మరణశిక్ష'

దీనిపై బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అరోరా మాట్లాడుతూ.. డిసెంబర్ 14లోగా 10 ఉరితాళ్లను సిద్దం చేయాలని మాకు ఆదేశాలొచ్చాయి. ఇవి ఎక్కడ ఉపయోగించబోతున్నారో మాకు తెలియదు. బక్సర్ జైలుకి ఉరితాళ్లను సిద్ధం చేయడంలో మంచి అనుభవం ఉంది. ఒక్క ఉరితాడును సిద్ధం చేయడానికి మూడు రోజులు పడుతుంది. ముఖ్యంగా వీటి తయారీకి యంత్రాలను తక్కువగా ఉపయోగించడం వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. 2016-17లో కూడా పాటియాలా జైలు నుంచి మాకు ఉరితాళ్లు సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చాయి. చివరిసారిగా బక్సర్‌ జైలు నుంచి పంపించిన ఉరితాడు ధర రూ.1,725అని అరోరా తెలిపారు. ఇనుము, ఇత్తడి ధరలలో తేడాల కారణంగా వీటి ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని అరోరా తెలిపారు. ఈ లోహాలను తాడు మెడను గట్టిగా చుట్టి ఉండేలా చూసుకోవడానికి ఉపయోగిస్తారని జైలు సూపరింటెండెంట్ వివరించారు. 

చదవండి: ఆ పిటిషన్‌ నేను పెట్టుకోలేదు: నిర్భయ కేసు దోషి