https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2019/11/29/rape.jpg?itok=mPON-8jy

అత్తింటిపై కక్షతో.. మైనర్‌ భార్యను రేప్‌ చేశాడు



జైపూర్‌: పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా.. భార్యను తన దగ్గరకు పంపలేదని.. అత్తింటివారిపై కక్ష కట్టిన ఒక అల్లుడు.. మాటువేసి మైనర్‌ భార్యను కిడ్నాప్‌ చేసి ఆపై రేప్‌ చేసిన ఘటన రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గురువారం బాలికను కాపాడి వైద్యపరీక్షలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల నిందితునికి, 9వ తరగతి చదివే15ఏళ్ల మైనర్‌ బాలికకు కొన్నేళ్ల క్రితమే.. పెళ్లి జరిగింది.

బాల్య వివాహం కావడంతో.. బాలిక తల్లిదండ్రులు ఆమెను మెట్టినింటికి పంపకుండా.. పుట్టింట్లోనే ఉంచి చదువు కొనసాగిస్తున్నారు. దీంతో అత్తింటి వారిపై కక్ష పెంచుకున్న అల్లుడు బుధవారం ఏకంగా భార్యనే కిడ్నాప్‌ చేశాడు. బాధితురాలు స్కూలు నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో.. దారికాచి ఆపై అపహరించి.. వ్యానులో దూరంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక గదిలో ఆమెను బంధించి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.  నిందితుడు, అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులు ఇంకా పట్టుబడలేదని ఈ మేరకు పోలీసులు పేర్కొన్నారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  నిందితునిపై అపహరణ, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.