https://www.ntnews.com/updates/latestnews/2019/lawstudent2911.jpg

లా స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం

రాంచీ : తన ఫ్రెండ్‌తో వెళ్తున్న ఓ న్యాయ విద్యార్థినిని బలవంతంగా లాక్కెళ్లి 12 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో నవంబర్ 26న సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో 26వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో ఓ ఎల్‌ఎల్‌బీ స్టూడెంట్.. తన ఫ్రెండ్‌తో కలిసి ఉంది. అదే సమయంలో అక్కడకు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు గన్‌పాయింట్‌లో బెదిరించి ఆమెను లాక్కెళ్లారు.

కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో.. తన స్నేహితులకు దుండగులు ఫోన్ చేశారు. ఆ తర్వాత కారులో వచ్చిన కొందరు, వీరిద్దరూ కలిసి ఆ యువతిని బ్రిక్ కిల్న్ ఏరియాకు తీసుకెళ్లారు. అక్కడ మొత్తం 12 మంది కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. 27న ఉదయం బాధితురాలు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. న్యాయ విద్యార్థినిపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి కారు, బైక్, తుపాకీ, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సీఎం అధికారిక నివాసానికి 10 కి.మీ. దూరంలో..

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన పరిసరాలు వీఐపీ జోన్ పరిధిలోకి వస్తాయి. అత్యాచారం జరిగిన ప్రాంతం జార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి 10 కిలోమీటర్ల దూరం, ఆమె చదువుతున్న లా కాలేజీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. డీజీపీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసాలు కూడా కూతవేటు దూరంలోనే ఉన్నాయి.